భద్రతా వైఫల్యం...ప్రియాంకగాంధీ ఇంట్లోకి దూసుకొచ్చిన కారు


భద్రతా వైఫల్యం...ప్రియాంకగాంధీ ఇంట్లోకి దూసుకొచ్చిన కారు


కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ నివసించే ఇంట్లోకి ఓ కారు భద్రతను దాటుకొని వెళ్లింది. గత వారం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సెంట్రల్ ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే లోథీ ఎస్టేట్ లోని ప్రియాంక గాంధీ ఇంట్లోకి ఓ కారు అకస్మాత్తుగా వచ్చింది. కారులో ఓ అమ్మాయితో పాటు ఐదుగురు ఉన్నారు. ఎటువంటి ముందస్తు అపాయింట్‌మెంట్‌ లేకుండా భద్రత కళ్లుగప్పి ప్రియాంక గాంధీతో సెల్ఫీ దిగేందుకు వాళ్లు ఇలా వచ్చినట్లు తెలుస్తోంది. గార్డెన్‌లో ఉన్న ప్రియాంక గాంధీ దగ్గరకు ఆ ఐదుగురు వెళ్లడంతో ఆమె ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని ఆమె కార్యాలయం సీఆర్పీఎఫ్ దృష్టికి తీసుకెళ్లింది.


ఇటీవలే సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీకి ప్రత్యేక భద్రతా దళం(SPG) భద్రతను తొలగించిన విషయం తెలిసిందే. ఎస్పీజీకి బదులుగా కేంద్ర రిజర్వ్‌ పోలీసు దళం(సీఆర్పీఎఫ్‌) ద్వారా జడ్‌ ప్లస్‌ సెక్యూరిటీని కొనసాగిస్తున్నారు. ఇది జరిగిన కొన్ని రోజులకే గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటి దగ్గర భద్రతను దాటుకొని వెళ్లి ప్రియాంక గాంధీని కలవడం జరిగింది. భద్రతా వైఫల్యం కారణంగా ఇలా జరిగిందని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ప్రియాంక గాంధీ కార్యాలయం సీఆర్పీఎఫ్ దృష్టికి తీసుకెళ్లింది.దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.


ఈ ఘటనపై సోమవారం(నవంబర్-2,2019)కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. దీని గురించిన వివరాలు ఇంకా తనకు తెలియదని,తాను లోక్ సభ నుంచి వస్తున్నానని,ఆఫీస్ కు వెళ్లి అధికారులతో దీనిపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు.